చంద్రబాబు సారథ్యంలో ప్రజాపాలనకు కొత్త దిశ.. సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందంజ: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
చంద్రబాబు సారథ్యంలో ప్రజాపాలనకు కొత్త దిశ.. సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ ముందంజ: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
తిరుపతి రవి కిరణాలు:
తిరుపతిలో నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ప్రజలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనుబోలులో జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని అన్నారు.
2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజాకేంద్రీకృత పాలనకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం, మంత్రి నారా లోకేష్ కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సోమిరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మాత్రమే ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.33 వేల కోట్లు వెచ్చిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో అన్ని సంక్షేమ పథకాలపై చేసిన వ్యయం కంటే ఇది ఎక్కువేనని వ్యాఖ్యానించారు.
అదే విధంగా ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు గతంలో ఇచ్చిన రూ.7 వేల స్థానంలో ఇప్పుడు రూ.14 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.
మహిళల కోసం స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన పలు ప్రభుత్వ శాఖలను తిరిగి బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
మద్యం విధానం, ఆర్థిక నిర్వహణ, పరిపాలనా వ్యవస్థలపై గత ప్రభుత్వాన్ని విమర్శించిన ఆయన, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు సంస్థల చర్యలు చట్ట ప్రకారమే కొనసాగుతున్నాయని అన్నారు.
తిరుపతిలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరవుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.