సూళ్ళూరుపేట, తడ పరిధిలో 29 లాడ్జీలపై పోలీసుల మెరుపు దాడులు
సూళ్ళూరుపేట, తడ పరిధిలో 29 లాడ్జీలపై పోలీసుల మెరుపు దాడులు.
గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘాతప్పనిసరి:-సీఐ ఎం మురళీకృష్ణ వెల్లడి
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట:-
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా, సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట మరియు తడ మండలాల్లో ఆదివారం లాడ్జీలపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడుల్లో భాగంగా సూళ్ళూరుపేట పరిధిలో 19 లాడ్జీలు, తడ మండలంలో 10 లాడ్జీలు వెరసి మొత్తం 29 లాడ్జీలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఎస్సై గంట అజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం రాజు,తడ ఎస్సై కె. కొండప్ప నాయుడు, దొరవారిసత్రం ఎస్సై జి.వి. చౌదరి, శ్రీహరికోట ఎస్సై బి. భాను ప్రసన్న మరియు ఆయా స్టేషన్ల కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ, లాడ్జీల ముసుగులో గంజాయి స్మగ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గంజాయి రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు లాడ్జీలలో ప్రత్యేక నిఘా ఉంచామని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. లాడ్జీల నిర్వాహకులు తప్పనిసరిగా అతిథుల ఐడి కార్డులను సేకరించి, రికార్డులను పక్కాగా నిర్వహించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా యజమానులపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.